ఎల్‌.కే.అద్వానీకి భారతరత్న అందించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా కూర్చున్నారు

ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్‌.కే. అద్వానీకు భారతరత్న ప్రధానం చేస్తున్న సందర్భానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ ఫోటోలో ముర్ము నిలబడి ఉండగా, అద్వానీ, ప్రధానమంత్రి మోదీ కూర్చొని కనిపిస్తారు. రాష్ట్రపతి కూర్చోడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయకుండా ఆమెను అవమానించారని ఆరోపిస్తూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.

క్లెయిమ్: ఎల్‌.కే. అద్వానీకి భారతరత్న అందించే సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూర్చోడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదు.

ఫాక్ట్(నిజం): అద్వానీకి భారతరత్న అందించే ముందు, అందించిన తరవాత ద్రౌపది ముర్ము కూర్చొనే ఉన్నారు. కేవలం అద్వానీకి భారతరత్న అందించే సమయంలో మాత్రమే ఆమె నిల్చొని అందించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో ఆమె అద్వానీకి భారతరత్న అందించి ఫోటో దిగుతున్న సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్‌.కే అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రధానం చేసారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రపతి భవన్‌లో జరుగుతాయి, కాని అద్వానీ ఆరోగ్య కారణాల దృష్ట్యా రాష్ట్రపతి ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందించారు. ఐతే పోస్టులో చేస్తున్న వాదనకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ కార్యక్రమంలో ఇతర అతిథులగే కూర్చొని ఉంది.

అద్వానీకి భారతరత్న అందించే ముందు, అందించిన తరవాత ద్రౌపది ముర్ము కూర్చొనే ఉన్నారు. కేవలం అద్వానీకి భారతరత్న అందించే సమయంలో మాత్రమే ఆమె నిల్చొని అందించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో ఆమె అద్వానీకి భారతరత్న అందించి ఫోటో దిగుతున్న సందర్భంలో తీసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మోదీ తన యూట్యూబ్‌ ఛానల్లో షేర్ చేసారు. ఇందులో అద్వానీ మెడలో మెడల్ ధరించిన తరవాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూర్చోవడం స్పష్టంగా చూడొచ్చు.

కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె కూర్చొని ఉండడం గమనించొచ్చు.

చివరగా, ఎల్‌.కే అద్వానీకి భారతరత్న అందించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా కూర్చున్నారు.