సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) ఒక గుంపు అనేక మంది యువకులను నగ్నంగా కొట్టడం కనిపిస్తుంది. పోస్ట్ ప్రకారం, ఉత్తర్ప్రదేశ్లో కొంతమంది దళితులు గంగా స్నానానికి వెళ్లి దేవాలయ దర్శనం చేసుకోవాలని ప్రయత్నించగా, కొందరు వచ్చి వారిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: ఇది ఉత్తర ప్రదేశ్లో కొంతమంది దళితులు గంగా స్నానానికి వెళ్లి దేవాలయాన్ని దర్శించాలనుకుంటే, కొంతమంది వారిపై దాడి చేసిన వీడియో.
ఫాక్ట్(నిజం): 10 సెప్టెంబర్ 2024న మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ అహల్య ఘాట్ వద్ద కొంతమంది యువకులు మద్యం తాగి నగ్నంగా స్నానం చేశారు. స్థానికులు వారిని నదిలో నుంచి బయటకు లాగి కొట్టారు. పోలీసులు వచ్చినప్పుడు, యువకులు అప్పటికే పారిపోయారు, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదుకాలేదు. ఈ ఘటనలో కులం లేదా మత సంబంధిత అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వీడియోకు ఉత్తరప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 12 సెప్టెంబర్ 2024న ప్రచురించబడిన ధమ్నోద్ సమాచార్ యూట్యూబ్ ఛానెల్లోని వీడియోకి దారితీసింది. వీడియో యొక్క వివరణలో “మహేశ్వర్లో నర్మదా నదిలో నంగగా స్నానం చేస్తున్న యువకుల వీడియో సోషల్ మీడియాలో వైరల్” అని రాయబడటం మేము గమనించాం.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా,మాకు దైనిక్ భాస్కర్ ప్రచురించిన రిపోర్ట్ లభించింది. దీని ప్రకారం, మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లోని అహల్య ఘాట్ వద్ద కొంతమంది యువకులు నర్మదా నదిలో నగ్నంగా స్నానం చేస్తున్నారు. ఈ విషయాన్ని చూసిన స్థానికులు ఘాట్ వద్దకు వచ్చి, ఆ యువకులను నది నుంచి బయటకు లాగి కొట్టారు. కొందరు పోలీసులకు ఫోన్ చేసారు కానీ, వారు రాకముందే యువకులు క్షమాపణలు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.
సంఘటన గురించి మరింత సమాచారం కోసం మేము మహేశ్వర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాము. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఘాట్ వద్ద నగ్నంగా స్నానం చేస్తున్న కొంతమంది యువకులు మద్యం తాగి, ప్రజలకు ఇబ్బంది కలిగించారు. దీంతో స్థానికులు వారిని తరిమి కొట్టారని పోలీసులు తెలిపారు.అయితే, ఈ సంఘటన గురించి ఎలాంటి కేసు నమోదుకాలేదు మరియు ఈ ఘటనలో కుల, మత సంబంధిత అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
చివరిగా, ఎంపీ అహల్యా ఘాట్లో నగ్నంగా స్నానం చేసినందుకు యువకులను కొట్టిన సంఘటన, దళితులపై దాడిగా తప్పుగా ప్రచారం చేయబడింది.