కొరోనా పై పోరులో సంఘీభావం తెలపడానికి మ్యాటర్‌హార్న్‌ పర్వతంపై వివిధ దేశాల జెండాలను ప్రదర్శించారు

భారత్ నుండి పొందుతున్న వైద్య సహాయానికి సంకేతంగా స్విస్ (Switzerland) దేశం పర్వతం పై లైట్ ఆర్ట్ తో ధన్యవాదాలు తెలిపింది. శిధిలాల నుండి శిఖరం వైపు భారత్ ఖ్యాతిని తీసుకువెళుతున్న నరేంద్రమోదీ గారికి పాదాభివందనం’ అంటూ, ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భారత్ నుండి పొందుతున్న వైద్య సహాయానికి సంకేతంగా పర్వతం పై లైట్ ఆర్ట్ తో స్విట్జర్లాండ్ దేశం ధన్యవాదాలు తెలిపింది.

ఫాక్ట్ (నిజం): స్విట్జర్లాండ్ లోని స్విస్ ఆల్ప్స్ మ్యాటర్‌హార్న్‌ పర్వతంపై భారత జెండా వెలుగులను ప్రదర్శించారు. అయితే, అది వైద్య సహాయానికి సంకేతంగా కాదు, కొరోనా పై పోరులో సంఘీభావం తెలపడానికి. చాలా రోజుల నుండి వివిధ దేశ జెండాలను అలా పర్వతంపై ప్రదర్శిస్తున్నారు. కావున, పోస్ట్ లో భారత్ నుండి పొందుతున్న వైద్య సహాయానికి సంకేతంగా అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్టులోని ఫోటో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, కొరోనా పై పోరులో సంఘీభావం తెలపడానికి మరియు భారతీయులందరికీ ఆశ మరియు బలం చేకూరాలని స్విట్జర్లాండ్ లోని స్విస్ ఆల్ప్స్ మ్యాటర్‌హార్న్‌ పర్వతంపై భారత జెండా వెలుగులను ప్రదర్శించినట్టు ‘Zermatt Matterhorn’ వారు ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ఇదే విషయాన్ని చెప్తూ ఉన్న ట్వీట్ పై ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, ‘Zermatt Matterhorn’ వెబ్సైటులో కూడా కొరోనాపై పోరులో ఆశా చిహ్నంగా జెర్మాట్ తరపున లైట్ ఆర్టిస్ట్ జెర్రీ హాఫ్స్టెటర్ 24 మార్చి 2020 నుండి మాటర్‌హార్న్‌ను ప్రతిరోజూ ప్రకాశిస్తాడని ఉన్నట్టు చదవొచ్చు.

వివిధ దేశాల జెండాలను (అమెరికా, చైనా, యూకే, జపాన్, జర్మనీ, ఒమాన్, సౌదీ అరేబియా, కువైట్, స్పెయిన్, బహరేన్, కతర్, మరియు ఇతర దేశలు) మాటర్‌హార్న్‌ మీద ప్రదర్శించినట్టు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, కొరోనా పై పోరులో సంఘీభావం తెలపడానికి మ్యాటర్‌హార్న్‌ పర్వతంపై వివిధ దేశాల జెండాలతో పాటు భారత జెండా ను కూడా ప్రదర్శించారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?