ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకునే దిశగా ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్ అణు, సైనిక ప్రదేశాలు లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు, డ్రోన్ దాడులను చేసింది. ఈ దాడుల్లో పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’కు కౌంటర్గా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3’ని ఇరాన్ ప్రారంభించింది. ప్రతీకార దాడిలో భాగంగా, ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్పై వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది (ఇక్కడ, ఇక్కడ). 22 జూన్ 2025న, అమెరికా ఇరాన్లోని ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై B-2 బాంబర్లతో బాంబు దాడులు చేసింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
ఈ నేపథ్యంలో, “అమెరికా ఇరాన్ పై బీ2 బాంబర్ వాడిన ప్రదేశం ఎలా అయిందో చూడండి” అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద గొయ్యిలోకి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 22 జూన్ 2025న, అమెరికా B-2 బాంబర్లతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన తర్వాత ఇరాన్ అణు కేంద్రంలో ఏర్పడిన గొయ్యిని చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు అమెరికా 22 జూన్ 2025న ఇరాన్ అణు కేంద్రాలపై చేసిన దాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడానికి ముందే ఈ వీడియో ఇంటర్నెట్లో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న అధిక నిడివి గల వీడియో (ఆర్కైవ్డ్), 17 జూన్ 2025న టిక్టాక్లో అప్లోడ్ చేయబడిందని మేము కనుగొన్నాము.
వైరల్ వీడియోలో చూపిస్తున్న దృశ్యాలను ఇరాన్పై అమెరికా చేసిన దాడికి సంబంధించినవిగా ఏ మీడియా సంస్థ కూడా రిపోర్ట్ చేయలేదు. ఈ వైరల్ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో మొదలైన సమాచారం మేము స్వతంత్రంగా నిర్ధారించలేకపోయినప్పటికీ, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వీడియోకు ఇరాన్పై అమెరికా చేసిన దాడికి ఎటువంటి సంబంధం లేదని మేము నిర్ధారించగలము, ఎందుకంటే ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడి 22 జూన్ 2025న చేసింది.
ఇరాన్పై అమెరికా చేసిన దాడుల్లో వారి అణు కేంద్రాలకు ఎంత నష్టం వాటిల్లిందో ఇరాన్ స్పష్టం చేయలేదు. అలాగే ఇరాన్పై అమెరికా దాడులకు సంబంధించిన దృశ్యాలను, దాడి తర్వాత ఇరాన్ అణు కేంద్రాలకు సంబంధించిన దృశ్యాలు అమెరికా కూడా విడుదల చేయలేదు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను పర్యవేక్షించిన రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్, ఈ దాడులకు సంబంధించిన వివరాలను మీడియాకు 25 జూన్ 2025న వివరించారు.
అలాగే, ఇరాన్పై ఉపయోగించిన బంకర్ బస్టర్ బాంబుల ఎలా పని చేస్తాయో వివరిస్తూ వాటికి సంబంధించిన పరీక్ష (టెస్ట్) ఫుటేజ్ను మీడియాతో పంచుకున్నారు. వీటిలో 12 ఇరాన్ దాడుల సమయంలో ఉపయోగించబడ్డాయని వారు మీడియాకు తెలిపారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
చివరగా, 22 జూన్ 2025న ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడిలో దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రానికి సంబంధించిన దృశ్యాలు అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.