అలహాబాద్ రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ పై నిలిచి ఉన్న వర్షపు నీరుని చూపిస్తూ ప్రధాని మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలోని రహదారి పరిస్థితంటూ షేర్ చేస్తున్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలో చిన్నపాటి వర్షానికే సముద్రంగా మారిన రహదారి అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టులో షేర్ చేసిన ఆ ఫోటోలో నీటితో నిండిపోయి ఉన్న రోడ్డు పక్కన ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ తో సహా పలువురు బిజెపి లీడర్ల ఫోటోలతో ఉన్న బ్యానర్ ఉంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలో చిన్నపాటి వర్షానికే సముద్రాన్ని తలపిస్తున్న రహదారి.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఆ ఫోటో ఆగస్ట్ 2018లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో తీసినట్టుగా విశ్లేషణలో తెలిసింది. బిజేపి లోక్‌సభ సభ్యురాలు రీటా బహుగుణ జోషి నియోజకవర్గం అయిన అలహాబాద్ నగరంలో వర్షం దాటికి రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ పై నీరు నిలిచిపోయిన సందర్బంలో తీసిన ఫోటో అది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘Patrika’ వార్తా సంస్థ వారు 2018లో రాసిన ఒక ఆర్టికల్ లో ఈ ఫోటో దొరికింది. ఆ ఆర్టికల్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం అలహాబాద్ నగరంలోని రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ పై నిలిచి ఉన్న వర్షపు నీటిలో ప్రజలు ప్రయానిస్తున్నారంటూ తెలిపారు. బిజేపి లోక్‌సభ సభ్యురాలు రీటా బహుగుణ జోషి నియోజకవర్గం అయిన అలహాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటనని ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో జరిగిన సంఘటనగా కొందరు ఇలా సోషల్ మీడియాలో చిత్రికరిస్తున్నారు.

‘Patrika’ వార్త సంస్థ రాసిన ఆర్టికల్ లో ఆ ఫోటో తీసింది రాజేష్ కుమార్ సింగ్ అని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా వెతకగా ‘AP Images’ వెబ్సైటులో పోస్టులోని అదే ఫోటో దొరికింది. ‘AP Images’ వెబ్సైటులోనూ ఆ ఫోటో అలహాబాద్ రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ కి సంబంధించిన ఫోటో అని తెలిపారు. ఈ ఆధారాలతో పోస్టులో చూపిస్తున్న ఆ  ఫోటో ప్రధాని మోదీ నియోజకవర్గం అయిన వారాణసికి సంబంధించినది కాదు అని  ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, అలహాబాద్ నగరంలోని రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ పై నిలిచి ఉన్న వర్షపు నీటిని చూపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలోని రహదారి పై నిలిచిపోయి ఉన్న వర్షపు నీరుగా చిత్రీకరిస్తున్నారు.