12 జూన్ 2025న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే, సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితో పాటు హాస్టల్ బిల్డింగ్లో ఉన్న మరికొందరు చనిపోయారు.
ఈ నేపథ్యంలో, ప్రమాదం తర్వాత, కాలిపోతున్న కాలేజీ భవనం యొక్క పై అంతస్తు నుండి ప్రజలు పడిపోతున్న దృశ్యాలని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. ‘#240 మెంబెర్స్ చనిపోయారు వాళ్ళ ఆత్మ శాంతించాలి అని కోరుకున్నాను,’ ‘మనుషులు అలా కింద పడుతున్నారు చూడండి’ అనే వాదనతో ‘#ahmedabad #airindia #accident’ అనే హాష్ట్యాగ్ పెట్టి ఈ వీడియోని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు, ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: 12 జూన్ 2025న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో కాలిపోతున్న భవనం పై అంతస్తు నుండి ప్రజలు పడిపోతున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో అహ్మదాబాద్ క్రాష్ సైట్ దగ్గర చిత్రించినది కాదు. 10 జూన్ 2025న ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని చూపిస్తుంది. ఈ వీడియోకి, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని, PIB ఫ్యాక్ట్ చెక్, 13 జూన్ 2025న స్పష్టం చేసింది. కాబట్టి, వైరల్ పోస్ట్లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్లను ఉపయోగింది ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, 10 జూన్ 2025న ది ఇండియన్ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానెల్లో వైరల్ వీడియోలోని దృశ్యాలను పోలిన విజువల్స్ తో ప్రచురించబడిన వార్తా కథనం మాకు దొరికింది.
ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి అని, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని ఈ వీడియో టైటిల్లో పేర్కొన్నారు. దీనితో పాటు, 10 జూన్ 2025న అప్లోడ్ చేసిన ఒక రెడ్డిట్ పోస్ట్ కూడా మాకు లభించింది. ఇందులో వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్ ఉంది. ఈ వీడియో యొక్క వివరణలో కూడా, ఈ సంఘటన ద్వారకాలోని షాబాద్ అపార్టుమెంటులో జరిగిన దృశ్యాలని చెప్పి ఉంది.
దీనిబట్టి, వైరల్ వీడియో 12 జూన్ 2025న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి ముందు జరిగిన సంఘటనకు సంబంధించింది అని మనకు అర్థం అవుతుంది. ఈ సంఘటనపై ప్రచురించబడిన వార్తా కథనాలు మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని MRV స్కూల్ సమీపంలో ఉన్న షాబాద్ అపార్ట్మెంట్లో 9వ, 10వ అంతస్తులలో ఉన్న డ్యూప్లెక్స్ ఫ్లాట్లో 10 జూన్ 2025న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 10:00 గంటల ప్రాంతంలో మంటలు ప్రారంభమై త్వరగా వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు.
కానీ, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, ఒక వ్యక్తి, అతని ఇద్దరు పిల్లలు మంటల నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి బాల్కనీ నుండి దూకి మరణించారు, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం, పూజ గదిలో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణం అయ్యుండొచ్చు. అయితే, వార్తా కథనాల ప్రకారం, ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదు.
అదనంగా, 13 జూన్ 2025న భారత ప్రభుత్వం యొక్క ఫ్యాక్ట్-చెక్ సంస్థ PIB ఫ్యాక్ట్ చెక్, ఈ వీడియోని అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో తప్పుగా ముడిపెడుతూ షేర్ చేస్తున్నారని ఒక X పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. వాస్తవానికి, ఈ వీడియో ఢిల్లీలోని ద్వారకలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనకు సంబంధించినదని, ఇందులో వారు పేర్కొన్నారు.
చివరగా, ఢిల్లీలోని ఒక భవనంలో జరిగిన ఒక అగ్ని ప్రమాద వీడియోను 12 జూన్ 2025న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద వీడియోగా తప్పుగా షేర్ చేస్తున్నారు.