DMK పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు అనుకూలంగా హిందువులకు వ్యతిరేఖంగా హామీలు ఇచ్చారని కొందరు ఫేస్బుక్ లో మేనిఫెస్టో ఫోటోలు పెట్టి షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): DMK ఎన్నికల హామీ: ‘ముస్లింల స్థలాలు ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటాం. హిందూ దేవాలయ భూములను పేదలకు పంచుతాం’.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టిన ఫోటోలు సరిగ్గా చూస్తే అవి 2016 లో అసెంబ్లీ ఎన్నిలకు DMK రిలీజ్ చేసిన మేనిఫెస్టో గా తెలుస్తుంది. ఆ మేనిఫెస్టోలో కూడా హిందూ దేవాలయ భూములను పేదలకు పంచుతామని అనలేదు, ఒక కమిటీ వేసి చట్ట ప్రకారం దేవాలయ భూములను కొనుక్కుందాం అనుకునే వాళ్ళ డిమాండ్ ని పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. కావున పోస్ట్ తో తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
పోస్ట్ లోని వాఖ్యాలను గూగుల్ లో వెతకగా దాన్ని మొట్టమొదటిగా మధు పూర్ణిమ కిశ్వర్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసిందని తెలుస్తుంది. ఆ పోస్ట్ యొక్క కామెంట్స్ లోనే కొంత మంది పోస్ట్ చేసింది 2016 మేనిఫెస్టో లోని దని కామెంట్ చేసారు. అంతే కాకుండా 2019 మేనిఫెస్టో లో అలాంటి హామీ లేదని కూడా చాలా మంది కామెంట్ చేసారు
వాటి ఆధారంగా 2016 మరియు 2019 మేనిఫెస్టోలు చూసినప్పుడు కామెంట్స్ లో నిజం ఉందని తెలుస్తుంది. 2016 మేనిఫెస్టో లో హిందూ దేవాలయ భూములను పేదలకి పంచుతామని లేదు. ఒక హై లెవెల్ కమిటీ వేసి చట్ట ప్రకారం దేవాలయ భూములు కొనాలనుకునే ప్రజల డిమాండ్స్ ని పరిశీలిస్తామన్నారు. అంతే కాకుండా ఖాళీగా ఉన్న హిందూ దేవాలయ భూములను కాపాడడానికి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. 2019 మేనిఫెస్టో లో వక్ఫ్ మరియు దేవాలయ భూముల గురించి ఎటువంటి హామీలు లేవు. మళ్ళీ ఎన్నికల ముందు కొందరు 2016 లోని హామీలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.