ఎన్నికల కమిషన్ జనసేన పార్టీ గుర్తు ను ‘బ్లేడ్’ కి మార్చింది అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): ఎన్నికల కమిషన్ జనసేన పార్టీ గుర్తు ను ‘బ్లేడ్’ కి మార్చింది.
ఫాక్ట్ (నిజం): జనసేన పార్టీ పైన పేర్కొనినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది.అందులో జనసేన పార్టీ ‘ఎన్నికల గుర్తు(గాజు గ్లాసు) లో ఎలాంటి మార్పు జరగలేదు, జరగదు’ అని పేర్కొంది. కావున ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయం లో నిజం లేదు.
“గాజు గ్లాసు గుర్తు పై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ec మనకు తాత్కాలికముగా ‘బ్లెడు’ ను కేటాయించడం జరిగింది. కావున ‘బ్లెడు’ గుర్తును ప్రచారం చేయమని మనవి. బ్లేడ్ గుర్తుకే మన ఓటు” అంటూ జనసేన పార్టీ పేరిట ఉన్న లేఖను జన సేన ట్వీట్ చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. జనసేన ట్విట్టర్ అకౌంట్ చూడగా అలాంటి ట్వీట్ చేయలేదని తెలుస్తుంది. జనసేన పార్టీ ఈ విషయాన్నీ ఖండిస్తూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది. అందులో జనసేన పార్టీ ‘ఎన్నికల గుర్తు (గాజు గ్లాసు) లో ఎలాంటి మార్పు జరగలేదు. జరగదు. తప్పుడు ప్రచారాలని నమ్మవద్దు’ అని సూచించింది.
గత కొన్ని రోజులు గా ఇటువంటి దుష్ప్రచారాలు చాలా జరుగుతున్నాయి. ఇటీవల ఎన్నికల కమిషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ను హెలికాప్టర్ గా మార్చింది అంటూ చేసిన తప్పుడు ప్రచారం పై FACTLY ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ కూడా రాసింది.
చివరగా, ఎన్నికల కమిషన్ జనసేన పార్టీ గుర్తును ‘బ్లేడ్’ కి మార్చిందంటూ పెట్టిన పోస్టులలో ఎటువంటి నిజం లేదు.