‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’ వారు ‘భారత రాజ్యాంగాన్ని మేము నమ్మము’ అంటూ వ్యాఖానించలేదు

భారత రాజ్యాంగాన్ని మేము నమ్మము, మాకు ప్రత్యేక చట్టాలు మేమే చేసుకుంటాం మా కోర్టులు మేమే కట్టుకుంటాం మీ రాజ్యాంగంతో మాకు పనిలేదు (ALMPLB) ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు” అంటూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) భారత రాజ్యాంగాన్ని మేము నమ్మము మాకు ప్రత్యేక చట్టాలు మేమే చేసుకుంటాం, మా కోర్టులు మేమే కట్టుకుంటాం, మీ రాజ్యాంగంతో మాకు పనిలేదు అని వ్యాఖ్యానించింది.

ఫాక్ట్ (నిజం): AIMPLB వారు భారత దేశంలోని ముస్లింల కోసం ప్రతి జిల్లాలో తమ ప్రత్యేక కోర్టులు( షరియా కోర్ట్ లేదా దార్-ఉల్-ఖజా ) ఏర్పరుస్తామని తెలిపారు. కానీ, భారత రాజ్యాంగాన్ని మేము నమ్మము దానితో మాకు పనిలేదు అని అనలేదు. కావున, పోస్టు తప్పుదారి పట్టించేలా ఉంది.  

పైన పోస్టులో ఆరోపించిన వ్యాఖ్యాలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) వారు చేశారా అని వెతికినప్పుడు, జులై 2018 లో ఆ బోర్డు సీనియర్ సభ్యుడైన జఫరయూబ్ జిలాని PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలోని ముస్లింలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వేరే ఇతర కోర్టులకు బదులుగా ఇస్లాం చట్టాల ఆధారంగా నడిచే షరియా కోర్టులను ( దార్-ఉల్-ఖజా) ఆశ్రయించేలా దేశంలోని ప్రతీ జిల్లాలో వీటిని ఏర్పరుస్తామని, వాటిని కట్టడానికి అయ్యే ఖర్చుల గురించి తదుపరి మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని తెలిపాడని “News18” వార్తా సంస్థ ప్రచురించిన కథనం ద్వారా తెలిసింది. ఇదే విషయం గురించి అనేక ఇతర వార్తా సంస్థలు ( NDTV, India Today, Financial Express) కూడా కథనాలు ప్రచురించాయి. కానీ, AIMPLB వారు భారత రాజ్యాంగాన్ని మేము నమ్మము దానితో మాకు పనిలేదు అని వ్యాఖానించినట్లుగా ఎక్కడా కూడా సమాచారం లభించలేదు.

చివరగా, ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’ వారు దేశంలోని ముస్లింల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ, ఆ సందర్భంలో రాజ్యాంగాన్ని కించపరుస్తూ  వ్యాఖానించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?