జూనియర్ ఎన్.టీ.ఆర్ చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేయలేదు. TV5 పేరుతో పెట్టినవి ఎడిట్ చేయబడిన ఫోటోలు

జూనియర్ ఎన్.టీ.ఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సంచలన వాఖ్యలు చేశాడంటూ TV5 బ్రేకింగ్ న్యూస్ స్క్రీన్ షాట్స్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం .

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): జూనియర్ ఎన్.టీ.ఆర్: “మా తాతను వెన్నుపోటు పొడిచే చంద్రబాబు పార్టీని లాక్కుని మమ్మల్ని భయటకు గెంటేసాడు”, “చంద్రబాబును ఓడిస్తేనే మా తాత ఆత్మకు శాంతి, అందుకే నా మామను వైసీపీ లోకి వెళ్ళమన్నాను”.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోలు ఎడిట్ చేయబడినవి. TV5 వారు పోస్ట్ లో ఉన్నవి ఫేక్ పోస్టింగులని వివరణ ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని ఫోటోలు సరిగ్గా చూస్తే TV5 ఛానల్ లో ఎలక్షన్ బ్రేకింగ్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్.టీ.ఆర్ అలా అన్నాడని వచ్చిందని చూడవచ్చు. కింద బ్రేకింగ్ న్యూస్ లో చంద్రబాబు ఎలక్షన్స్ కి కేవలం రెండు రోజులే ఉందని అన్నట్టుగా ఉంది. కాబట్టి య్యూట్యూబ్ లో TV5 ఛానల్ లో గత రెండు రోజుల్లో వచ్చిన ఎలక్షన్ బ్రేకింగ్ వీడియోలు చూడగా స్క్రీన్ షాట్స్ ఎక్కడి నుండి తీసుకున్నారో ఆ వీడియో దొరుకుంతుంది. ఆ వీడియో చూస్తే జూనియర్ ఎన్.టీ.ఆర్ మీద ఎటువంటి వార్త ఉండదు. చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన వాఖ్యాలు చూడొచ్చు. పోస్ట్ చేసిన ఫోటో లో డేట్ కూడా ఎడిట్ చేసినట్టుగా చూడవచ్చు. TV5 వారు డేట్ ని ‘09-Apr’ గా రాస్తారు కానీ  పోస్ట్ చేసిన ఫోటో లో ‘ 09 APR’ గా ఉంది. కావున పోస్ట్ చేసిన ఫోటోలు ఎడిట్ చేయబడినవి.

అంతే కాకుండా జూనియర్ ఎన్.టీ.ఆర్ ఇలా అన్నాడని వేరే వార్తా పత్రికలు ప్రచురించలేదు మరియు తను స్వయంగా కూడా ఎక్కడా కూడా ట్వీట్ లేదా పోస్ట్ చేయలేదు. TV5 వారు కూడా దీనిని కండిస్తూ తమ ఛానల్ లో వివరణ ఇచ్చారు. కాబట్టి పోస్ట్ లో ఎటువంటి నిజం లేదు.

చివరగా, పోస్ట్ లో చెప్పినట్టుగా జూనియర్ ఎన్.టీ.ఆర్ చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేయలేదు. TV5 పేరుతో పెట్టినవి ఎడిట్ చేయబడిన ఫోటోలు.